మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని డిజాస్టర్లు అయ్యాయి. కొన్ని చిత్రాలు పర్వాలేదనిపించాయి. కానీ ఏదీ ఆయనకు ఆనందాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. ఐతే ఇన్నేళ్ల కరువు తీర్చేస్తూ మాస్ రాజా కొత్త సినిమా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తోంది. కేవలం రెండో రోజే బ్రేక్ ఈవెన్ అందుకున్న ఈ చిత్రం.. ఆదివారం కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఈ చిత్రం మీద పెట్టుబడి పెట్టిన అందరూ భారీ లాభాలు అందుకోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే అందరికంటే ఎక్కువ లాభం రవితేజకే అన్నది యూనిట్ వర్గాల సమాచారం. గత కొన్నేళ్లలో రవితేజ మార్కెట్ బాగా దెబ్బ తినడంతో ఆయన పారితోషకం తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కొందరు హీరోలు అనుసరిస్తున్నట్లు లాభాల్లో వాటా తీసుకోవడం, ఏరియాల రైట్స్ తీసుకోవడం లాంటి మోడల్ వైపు కూడా ఆయన మళ్లాల్సి వచ్చింది.
ఇందులో భాగంగానే ‘ఇరుముడి’కి రవితేజ రిలీజ్ ముంగిట పారితోషకం అంటూ ఏమీ తీసుకోలేదు. కొంత మేర లాభాల్లో పర్సంటేజీ తీసుకోవడంతో పాటు నైజాం ఏరియా హక్కులను తీసుకున్నారు. రిలీజ్ ముంగిట ‘ఇరుముడి’ థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.7 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు చూస్తే ఆ మార్కును రెండో రోజే దాటేసింది ‘ఇరుముడి’. ఫుల్ రన్లో ఈ సినిమా నైజాంలో రూ.25 కోట్లకు తక్కువ కాకుండా షేర్ రాబట్టేలా కనిపిస్తోంది.