- గొడవసద్దుమణిగినట్లేనా..?
- సుష్మితను సీఎం క్షమించేస్తారా?
రాష్ట్రంలో వారం రోజులుగా సాగుతున్న రాజకీయ దుమారానికి చెక్ పెట్టే ఆసక్తి కర సంఘటన సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలతో ఆమె కుటుంబానికి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య అగాధం ఏర్పడిందని, మంత్రి పదవి నుంచి కొండాను తొలగించడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. ప్రతీ ఏటా రాఖీ పండుగకు సీఎంకు రాఖీ కట్టే అలవాటున్న కొండా సురేఖ, ఇవాళ నేరుగా సీఎం నివాసానికి వెళ్లారు. మరో మంత్రి సీతక్కతో కలిసి సీఎంకు రాఖీ కట్టారు. సీఎం రేవంత్ రెడ్డి భార్య గీత, ఆయన కుమార్తెను ఆప్యాయంగా పలకరించారు. అటు రేవంత్ రెడ్డి కూడా రాజకీయ వివాదానికి, రాఖీ పండుగకు సంబంధం లేదన్నట్లుగా మంత్రి కొండాతో ఆప్యాయంగా మాట్లాడారు.
సిగ్నల్ ఇచ్చినట్లేనా..?
కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి వర్గం మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేసుకుంది. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది. అటు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ కూడా కొండాను కేబినెట్ నుంచి సాగనంపాల్సిందేనంటూ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో అసలు కొండా సురేఖ సీఎం నివాసానికి వస్తారా రారా అంటూ ఉదయం నుంచి చర్చ సాగింది. అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ కొండా సురేఖ సీఎం నివాసానికి రావడం, రేవంత్ రెడ్డి కూడా సాదరంగా ఆహ్వానించడం కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. మంత్రి కొండాపై ఉన్న కోపం రాఖీతో పోతుందా అని ఓ వైపు, అంతా సెటిల్ అయినట్లే నంటూ మరో వైపు చర్చ సాగుతోంది. సీఎంకు రాఖీ కట్టడం ద్వారా రేవంత్ రెడ్డిపై తనకు ఎలాంటి వ్యతిరేకతా లేదన్న సంగతిని కొండా సురేఖ చెప్పే ప్రయత్నం చేయగా, ఇంటికి వచ్చిన మహిళా మంత్రిని వెనక్కి పంపించి అవమానించే ఉద్దేశం తనకు లేదంటూ రేవంత్ రెడ్డి కూడా చాటిచెప్పారు. అయితే.. ఈ భేటీలో సుష్మిత వ్యాఖ్యలు, తాజా రాజకీయ పరిణామాల గురించి ఎలాంటి చర్చ రాకపోయినా, సయోధ్య దిశగా ఓ అడుగు పడినట్లుగానే కనిపిస్తోంది.