తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన అనర్హత ఫిర్యాదు చెల్లదంటూ స్పీకర్ తీర్పు చెప్పడాన్ని తప్పుబట్టిన హైకోర్టు, తక్షణం తమ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా స్పీకర్ కు , ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టులోని చీఫ్ జస్టిస్ బెంచ్ సమాచారం కూడా అందించింది.
దానంపై అనర్హత వేటు వేయాలంటూ భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 10వ షెడ్యూల్ ప్రకారం వ్యవహరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు పలు ఆధారాలు సమర్పించామని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా.. సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్ ట్రైబ్యునల్ మార్చి 11న ఉత్తర్వులిచ్చిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం.. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లోనూ గుబులు మొదలయ్యింది.