మంత్రి కొండా సురేఖపై వేటుకు దాదాపుగా రంగం సిద్ధమయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుష్మిత దారుణమైన పదజాలంతో విమర్శించడానికి బాధ్యురాలిని చేస్తూ కేబినెట్ నుంచి వేటు పడబోతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి, తన నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు అందజేశారు. కుమార్తె వ్యాఖ్యలకు బాధ్యత కొండా సురేఖ వహించాల్సిందేనని అందులో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డిని దారుణంగా సుష్మిత దూషించడం, రెండోసారి కూడా అదే తప్పు చేయడం, అయినప్పటికీ దాన్ని ఇంతవరకూ మంత్రిగా కొండా సురేఖ ఖండించకపోవడం చూస్తుంటే, సుష్మిత మాటల వెనుక కొండా ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుందని క్రమశిక్షణా కమిటీ అభిప్రాయపడింది. తన కుమార్తె వ్యాఖ్యలకు, తనను ముడిపెట్టొద్దంటూ కొండా సురేఖ లేఖ రాసినా, దాంతో క్రమశిక్షణా కమిటీ సంతృప్తి చెందలేదు. కుమార్తెను లైన్ లో పెట్టాల్సిన బాధ్యత తల్లిగా, మంత్రిగా కొండా సురేఖపైనే ఉందంటోంది. అందుకే ఈ వ్యవహారంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం ద్వారా పార్టీలో గీత దాటుతున్న వారికి ఘాటు వార్నింగ్ ఇచ్చినట్లువుతుందని సిఫార్సు చేసినట్లు సమాచారం. కాసేపట్లో ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి కూడా మల్లు రవి అందజేయనున్నారు.
మంత్రి పదవిని కాపాడుకోవడానికి కొండా సురేఖ ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేను బెంగళూరుకు వెళ్లి కలిశారు. హైదరాబాద్ లోనూ ఇతర మంత్రులు సీనియర్ నేతలను కలిసే ప్రయత్నం చేశారు. కానీ, ఎక్కడా ఆమెకు మద్దతు దక్కినట్లు కనిపించడం లేదు. దీంతో కొండా సురేఖ పదవికి రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటారా లేక వేటు పడేదాకా చూసి, దాన్ని సెంటిమెంట్ గా వాడుకునే ప్రయత్నం చేస్తారా అన్నది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అటు ఎమ్మెల్యే మేఘారెడ్డిని ఇబ్బందిపెడుతున్న సీనియర్ నేత చిన్నారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలంటూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ తన నివేదికను పీసీసీ అధ్యక్షుడికి అంద జేసింది.